జగన్ వంచించాడు, వైయస్ మా నేతనే: రఘువీరా రెడ్డి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీ నాయకుడేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు తీరిక లేకపోవడం వల్లనే వాయలార్ రవి రాష్ట్రానికి వచ్చారని ఆయన చెప్పారు. తమది జాతీయ పార్టీ అని, కేంద్ర నాయకులు రావడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అందరినీ సమన్వయపరచడానికే వాయలార్ రవి వచ్చారని ఆయన చెప్పారు.
ఏ ఎన్నికలనైనా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి వీలుగా వ్యూహాలను రూపొందించుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి తాము ముందంజలో ఉన్నామని ఆయన అన్నారు. ప్రచారానికి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వెళ్తారని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రతినిధిగా వచ్చిన వాయలార్ రవి శుక్రవారం అనంతపురం జిల్లాలోని ఉప ఎన్నికలు జరిగే స్థానాలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. జెసి దివాకర్ రెడ్డే తాను దూరంగా ఉంటానని చెప్పారు.