కాంగ్రెసులోనే ఉన్నాం, ప్రచారానికి సై: రాజశేఖర్, జీవిత
ఇతర పార్టీలలో చేరే విషయమై ఆయా నేతలతో చర్చలు జరిపింది నిజమేనని వారు చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని, కాంగ్రెసు పార్టీలనే ఉన్నామని చెప్పారు. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమని ఆదేశిస్తే అక్కడ ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాజశేఖర్ దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అయితే ఇరువురి మధ్యన పొసగక పోవడంతో వారు జగన్కు దూరమయ్యారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేక పోయారు. అనంతరం వారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు జరిపారు.
అయితే ఇటీవల అరెస్టైన తారా చౌదరి కేసులో రాజశేఖర్ పేరు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి తెలుగుదేశం పార్టీ తలుపులు తెరవలేదని తెలుస్తోంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు వచ్చాకే పార్టీలో చేరతామని వారు రాష్ట్ర బిజెపి నేతలకు సూచించారు.
దీంతో అది వాయిదా పడింది. అనంతరం తారా కేసులో రాజశేఖర్ ఉండటంపై బిజెపిలో తర్జన భర్జన జరిగిందని, చివరకు ఆ పార్టీ కూడా తలుపులు మూసివేసిందంటున్నారు. అయితే తాజాగా వారి తిరిగి కాంగ్రెసులోనే ఉండేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు వారు ఆదివారం తిరుపతిలో చెప్పారు.