మూడు రోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు: వైయస్ జగన్
ఢిల్లీ పెద్దలు, ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, వాయలార్ రవి, గవర్నర్ నరసింహన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన అరెస్టు కోసం చర్చలు జరిపారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను అడ్డుకోవడానికే తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగదేశం, కాంగ్రెసు కలిసి ఉప ఎన్నికలను అడ్డుకోవడానికి తనను అరెస్టు చేయిస్తారని అంటున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై, తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తన అరెస్టు తర్వాత భారీగా అల్లర్లు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వాయిదా వేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి వాయలార్ రవి ఇందుకు చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. తన అరెస్టుకు సంబంధించి తనకు ఇప్పుడే సమచారం అందిందని ఆయన చెప్పారు.
ప్రజా నాయకుడినైన తనను అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలు చేస్తున్నారని, ఇటువంటి నీచమైన కుట్ర తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు, ఢిల్లీ పెద్దలు కుట్ర చేశారని ఆయన అన్నారు. తన అరెస్టుకు ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభంజనాన్ని అపలేక, ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం కుట్ర చేసి తనను అరెస్టు చేయించడానికి సిబిఐతో మంతనాలు జరుపుతున్నాయని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాత జరిగే అల్లర్లకు తనను బాధ్యుడిని చేసి ఉప ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నాయని ఆయన అన్నారు.
కాగా, వైయస్ జగన్ అరెస్టు వార్తలు ఊహాగానాలు మాత్రమేనని డిజిపి దినేష్ రెడ్డి రాజమండ్రిలో అన్నారు. 28వ తేదీ తర్వాత ఎదురయ్యే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఫలానా జరుగుతుంది కాబట్టి ఫలానాది చేయాలనేది సరి కాదని, అలాంటి ఊహాగానాలు సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ చేసిన ఆరోపణలను డిజిపి తోసిపుచ్చారు. తాను ఏనాడు కూడా కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలుసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.