పదవికోసం సంతకాలు: జగన్పై విరుచుకుపడ్డ ఆజాద్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని అన్ని పథకాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. పథకాలు పార్టీకి చెందినవని, ఏ ఒక్కరివో కావన్నారు. వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు మేనిఫెస్టోలోనివే అని చెప్పారు. ఎన్నికల ప్రణాళిక వైయస్ ఒక్కడిదే అనడం సరికాదని, అది పార్టీదన్నారు. జగన్ తన స్వలాభం కోసమే ఉప ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. ఉప ఎన్నికలు ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు.
జగన్ తన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో సమర్థ, సుస్థిర పాలన అందిస్తున్నామన్నారు. వైయస్ శవం పక్కన పెట్టుకొని జగన్ తాను ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాలు సేకరించారని ఆరోపించారు. సిఎం కావడానికి అతనికి ఏం అనుభవముందని ప్రశ్నించారు. సిఎం పదవి కోసం జగన్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారన్నారు.
తండ్రి చనిపోతే కొడుకుకు అధికారం రాచరిక కాలంలో వచ్చేదని, ఇప్పుడు ప్రజాస్వామ్యయుగం నడుస్తుందని, తండ్రి తర్వాత కొడుక్కు అధికారం రాదన్నారు. ప్రజలు ఆదరిస్తేనే పదవులు వరిస్తాయని చెప్పారు. వైయస్ కుటుంబం పైన కాంగ్రెసు ప్రతీకారం తీర్చుకుంటుందనే వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల ఆరోపణలు అవాస్తవాలు అని కొట్టి పారేశారు. కేవలం జగన్ను మాత్రమే అరెస్టు చేశారా అని ప్రశ్నించారు.
మాజీ కేంద్రమంత్రి రాజా, జార్ఖండ్ మాజీ సిఎం మధుకొడా, మహారాష్ట్రలో మాజీ సిఎం, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తదితరులు జైలుకెళ్లారన్నారు. వారంతా జైలుకెళ్లగా జగన్ ఎందుకు వెళ్లకూడదాని ప్రశ్నించారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తే సిబిఐ వారిని ముట్టుకోవద్దా అని జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆర్థిక వనరులు దోచుకున్న వ్యక్తి ఎప్పుడూ నిస్వార్థపరుడు కాలేడన్నారు. ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు విచారణ జరుగుతోందన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతోందని, ఇందులో కాంగ్రెసు పాత్ర లేదన్నారు. జగన్ దోచిన సొమ్మంతా రాష్ట్రంలోనిదే అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో జగన్ భారీ భవనాలు ఎలా నిర్మించారన్నారు. తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. అతనికి ఏం అనుభవముందని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడన్నారు. కాంగ్రెసులోనే ఉంటే ఏదో ఓ పదవి వచ్చేదన్నారు. కిరణ్ పాలన బాగుందని, మాగుంట పార్వతమ్మకు ఓటేసి గెలిపించాలని కోరారు.
అర్థాంతరంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలన్నారు. అతను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అభివృద్ధి కోసమే పని చేశారన్నారు.












Click it and Unblock the Notifications