ప్రమాదం: 34 మంది ఎపి షిర్డీ యాత్రికుల మృతి
హైదరాబాదులోని లక్డిడికా పూల్ నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని షోలాపూర్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన ప్రయాణికుల బంధువులు లక్డికాపూల్లోని కాళేశ్వరి ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి సరైన సమాచారం కూడా అందడం లేదు. అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.
హైదరాబాదుకు చెందిన కృష్ణతులసి, సమిత్ కుమార్, వెంకటేష్, సుబ్బారావు మరణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ బస్సు ప్రయాణానికి కెపిహెచ్బి కాళేశ్వరి ట్రావెల్స్ ఏజెంట్ ద్వారా సంపత్ అనే వ్యక్తి 14 సీట్లు బుక్ చేయగా, ప్రణీత్, కిరణ్ అనే ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేశారు. మియాపూర్ ఏజెంట్ ద్వారా మరో 3 టికెట్లు బుక్ బుక్ అయ్యాయి. కూకట్పల్లి దివాకర్ ట్రావెల్స్ ఏజెంట్ ద్వారా జి. మోహన్ రావు అనే వ్యక్తి 7 టికెట్సు బుక్ చేశారు.
ఈ బస్సులో ప్రయాణించినవారిలో 14 మంది టిసిఎస్ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. వీరు విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు చెందినవారని భావిస్తున్నారు. ఈ బస్సులో సంపత్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులంతా ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. కృష్ణతులసి, సుమిత్ అశోక్, పూజిత అనే వ్యక్తులు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. షిర్డీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వైద్య సేవలు అందేలా చూడాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీని ఆదేశించారు.
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగిన సహాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందించడం కోసం ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జల్కోట్లో ఉన్న మృతుల్లో 9 మందిని గుర్తించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
హెల్ప్ లైన్ - 02472 - 222700, 222900