జగన్కు జైలులోనే ఇవ్వండి: ఈడికి సిబిఐ కోర్టు ఆదేశం
జగన్కు నోటీసులు అందజేయాలని ఈడికి సూచించింది. దీంతో ఈడి జగన్ తరఫు లాయర్లకు నోటీసులు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే జగన్ లాయర్లు ఈడి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో జైలులోనే జగన్కు నోటీసులు అందజేయాల్సిందిగా ఈడికి సిబిఐ కోర్టు సూచించింది. కోర్టు విచారణను ఈ నెల 25వ తేదికి వాయిదా వేసింది. దీంతో ఈడి జగన్కు ఈ రోజు నోటీసులు అందజేయనుంది.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్కు అనుమతించిన విషయం తెలిసిందే. నిందితుల విచారణకు మంగళవారం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిని విచారించనున్నారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయరాఘవలను విచారిస్తారు. ఓఎంసి కేసులో శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మిలను విచారిస్తారు. నిందితులను పదిహేను రోజులలో విచారించాలని కోర్టు ఈడికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ రోజు(మంగళవారం) నుండి పదిహేను రోజులలో వారి విచారణ పూర్తి కావాల్సి ఉంది. ఈడి నిందితులకు సమన్లు జారీ చేసి విచారించనుంది. పదిహేను రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈడి సాధ్యమైనంత త్వరగా సమన్లు జారీ చేయనుంది. కాగా ఆయా కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు ఈడి ఇటీవల పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణకు కోర్టు అనుమతించడంతో ఈడి ఎమ్మార్, జగన్ ఆస్తులు, ఓఎంసి కేసులలో విదేశాల నుండి అక్రమంగా వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయనుంది.