విజయమ్మ సిరిసిల్ల దీక్షపై ధ్వజమెత్తిన కెటిఆర్
నేతకు, చేనేతకు మధ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తేడా తెలియదని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. ఆంధ్ర ఆధిపత్య అహంకారాన్ని వదలిపెట్టాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వానికి సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్షకు దిగుతున్నారని ఆయన అన్నారు
ఆంధ్ర పాలకుల మొసలి కన్నీళ్లు తమకు అవసరం లేదని, తమ సమస్యలను తాము తీర్చుకుంటామని ఆయన అన్నారు. సిరిసిల్ల కార్మికుల సమస్యలను వైయస్ రాజశేఖర రెడ్డి పరిష్కరించలేదని ఆయన అన్నారు. రాజన్న రాజ్యం తేస్తానంటున్న విజయమ్మ సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలకు తెర లేపుతారా అని ఆయన అడిగారు. తెలంగాణను అడ్డుకున్నది వైయస్ రాజశేఖర రెడ్డేనని కాంగ్రెసు సీనియర్ నేత వెంకటస్వామి చెప్పారని ఆయన గుర్తు చేశారు.
చేనేత కార్మికులపై విజయమ్మకు ఏ మాత్రం ప్రేమ లేదని ఆయన అన్నారు. రైతాంగ సమస్యలపై చర్చకు ఢిల్లీ వెళ్లిన విజయమ్మ తెలంగాణ సమస్యను ఎందుకు చర్చించలేదని ఆయన అడిగారు. చేనేత సమస్యలపై విజయమ్మ దీక్ష చేస్తానంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటిని నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాలని, తాగునీటి దోపిడీని అడ్డుకుని అడ్డుకుని తీరుతామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం గురించి మధు యాష్కీ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు. కేంద్రం తెలంగాణను ఎప్పుడు ఇస్తోందో మధు యాష్కీకి చెప్పి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జులై లోపు తెలంగాణ రాకుంటే రాజీనామా చేస్తానన్న యాష్కీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.
చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమపై మధుయాష్కీ విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందనే నమ్మకం తమకు ఉందని, రాకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు తాను ఇంకా ముఖ్యమంత్రి ఉన్నానని చెప్పుకోవడం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పట్టారని ఆయన వ్యాఖ్యానించారు.