నెంబర్ టు: సోనియా రాజీ ఫార్ములా, పవార్ చల్లబడేనా

ప్రధాని దేశంలో లేనప్పుడు గతంలో ఆ పనులను ప్రణబ్ ముఖర్జీ చూసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను పవార్కు అప్పగిస్తామని, ఆయనతో పాటు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, పార్లమెంటులో కాంగ్రెసు పార్లమెంటరీ నేత కూడా పర్యవేక్షిస్తారని కాంగ్రెసు ఓ రాజీ ఫార్ములాను ప్రతిపాదించింది. తీవ్ర అసంతృప్తితో ఉన్న పవార్ శుక్రవారం ఉదయం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన విషయం తెలిసిందే.
పవార్ తనను కలిసినప్పుడు సోనియా ఈ విషయాన్ని ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కోర్ కమిటీలో ఈ విషయంపై చర్చించి అనంతరం రాజీ ఫార్ములాపై ప్రకటన చేస్తారని సమాచారం. పవార్ డిమాండుకు కాంగ్రెసు కాస్త దిగొచ్చినట్లుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు మాత్రం ఇష్టపడినట్లుగా కనిపించడం లేదని కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని బట్టి అర్థమవుతోంది.
అయితే కాంగ్రెసు ప్రతిపాదించిన త్రిసభ్య కమిటీ ఫార్ములాకు శరద్ పవార్ చల్లబడతారో లేరో చూడాలి. ఈ కమిటీకి ఆయన అంగీకరించిన పక్షంలో రక్షణ శాఖను తనకు కేటాయించాలని కాంగ్రెసును డిమాండ్ చేసే అవకాశముందని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు అయి అవగానే యుపిఏలో నెంబర్ టు వివాదం తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications