రాజీనామా ఏది: కిరణ్కు పార్థసారథి చిక్కు, అక్షింతలు
ఆరోపణలు ఎదుర్కొని కోర్టు కేసులో నేరస్తుడిగా నిర్ధారణ అయిన పార్థసారథిని వెంటనే కేబినెట్ నుండి తొలగించాలని, ఇప్పటి వరకు ఈ కేసు విషయమై తమ దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని కిరణ్ పైన అధినాయకులు మండిపడ్డారని తెలుస్తోంది. కిరణ్కు అధిష్టానం అక్షింతల నేపథ్యంలో పార్థసారథి ఏ క్షణంలోనైనా తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా మంత్రి పార్థసారథి ఫెరా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా బుధవారం ఆర్థిక నేరాల కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. గతంలో తన కంపెనీ మిషనరీ కొనుగోలు విషయంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పార్థసారథిపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మంత్రి ఆర్థిక నేరాల కోర్టులో హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు మంత్రి నేరం చేసినట్లుగా బుధవారం నిర్ధారించింది.
కోర్టు ఆయనకు రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది. మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది.
అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.