టెక్కీ నీలిమ మృతి: ప్రశాంత్ను ప్రశ్నించిన పోలీసులు
తాను కార్యాలయంలో నీలిమ పక్కన కూర్చునేవాడినని, ఇద్దరం తెలుగువాళ్లం కావడంతో స్నేహం ఏర్పడిందని ప్రశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్లో ఏడాది పాటు పనిచేసిన తర్వాత ప్రశాంత్ నెల క్రితం కాగ్నిజెంట్కు మారాడు. తన మరణానికి ముందు ఇచ్చిన ఇ -మెయిల్స్లో నీలిమ ప్రశాంత్ను పండుగా సంబోధించింది. ఈ విషయాన్ని పోలీసులు ప్రస్తావించగా, తాము మంచి మిత్రులం కావడంతో ఆమె తనను అలా ముద్దు పేరుతో పిలిచేదని చెప్పాడు.
నీలిమ వద్ద క్రెడిట్ కార్డు లేదని, దాంతో అమెరికాలో ఏదైనా కొనాలనుకున్నప్పుడు తన క్రెడిట్ కార్డు వాడేదని అతను చెప్పాడు. తన భర్తకు ఇచ్చిన ఇ -మెయిల్లో నీలిమ - తాను ప్రశాంత్ క్రెడిట్ కార్డు వాడుకున్నానని, అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని చెప్పింది. తాము జులై 21వ తేదీన ఒకే విమానంలో హైదరాబాదు వచ్చినట్లు కూడా ప్రశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది.
హైదరాబాదు వచ్చిన తర్వాత ప్రశాంత్ నేరుగా విశాఖపట్నం వెళ్లిపోగా, నీలిమ హైదరాబాదులోని కూకట్పల్లిలో గల తన ఇంటికి వెళ్లింది. తన సోదరి పెళ్లి కోసం తాను ఇక్కడికి వచ్చినట్లు ప్రశాంత్ చెప్పాడు. ఇన్ఫోసిస్ క్యాంపస్లో నీలిమ మరణించినప్పడు ప్రశాంత్ ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను నీలిమతో జులై 31వ తేదీన మూడు సార్లు మాట్లాడినట్లు ప్రశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఒక్కసారి మాట్లాడినప్పుడు వచ్చే జీవితంలో కలుసుకుందామని నీలిమ అన్నట్లు అనిపించిందని అతను పోలీసులకు చెప్పినట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేసి ఇంతకు ముందు హాస్యానికి అలా అన్నట్లు తెలిపిందని అతను చెప్పాడు. ఇంత రాత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చావని అడిగితే ఆఫీసు పని ఉందని చెప్పిందని ప్రశాంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
భర్త ఆఫీసు వద్ద బైక్పై తనను దింపాడని కూడా నీలిమ చెప్పిందని అతను చెప్పాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు విషయంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు.