తెలంగాణ మిత్రులకు తెలిసి ఉండదు: ముఖ్యమంత్రి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరంపై ఇప్పటి వరకు 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఈ స్థితిలో డిజైన్ మార్చడం సాధ్యం కాదని, ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రాలతో తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ విధమైన నష్టం లేదని ఆయన అన్నారు. గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 400 టిఎంసిల నీళ్లు వృధాగా సముద్రంలో కలిశాయని, పోలవరం పూర్తయి ఉంటే అవి వినియోగంలోకి వచ్చి ఉండేవని ఆయన అన్నారు.
పోలవరం నుంచి రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు 45 టిఎంసిల నీరు అందుతుందని, కృష్ణా డెల్టాకు సకాలంలో నీరు చేరుతుందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారాన్ని స్థాపించే ఆలోచన చేస్తున్నామని, దీనిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, బయ్యారం వ్యవహారాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి అప్పగించే ప్రయత్నం చేస్తామని, 60వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పటికే ప్రకటించిందని ఆయన చెప్పారు. పాల్వంచ ఏడో దశకు బొగ్గు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
వైద్య సేవల్లో క్రమశిక్షణను తేవడానికి ప్రయత్నిస్తామని, శ్రీకాకుళం, ఆదిలాబాద్, చిత్తూరు జిల్లా ప్రయోగాత్మక సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ఎత్తి చూపితే సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. రెండు గిరిజన బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మైనింగ్, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి వంద పడకలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications