జయశంకర్ పోస్టర్ చించివేత: వైస్ను వెంటాడి కొట్టారు
సదరు వైస్ ప్రిన్సిపల్ తోటి లెక్చరర్లు, విద్యార్థుల ముందే ఆ పోస్టర్ చించి వేశారు. దీనితో ఆగ్రహించిన వారు ఇదేమిటని అడిగారు. విద్యార్థులు కూడా వారికి జత కలిశారు. అతను చెప్పిన సమాధానం సరిగా లేక పోవడంతో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో వందలాది మంది కళాశాల వద్ద గురువారం ఆందోళనకు దిగారు. కొంత కాలంగా తెలంగాణ లెక్చరర్ల మీద కక్ష కట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న ఆ వైస్ ప్రిన్సిపల్ను తక్షణమే తప్పించాలని కళాశాల ముందు బైటాయించారు. నగర శివారు ప్రగతినగర్ చెరువు కట్ట ప్రాంతంలో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో కొద్ది రోజల క్రితం సత్యనారాయణ రెడ్డి వైస్ ప్రిన్సిపల్గా విధుల్లో చేరాడు.
గురువారం ఉదయం 6 గంటల సమయంలో బాలుర కళాశాలలో సత్యనారాయణ రెడ్డి తన సీటు వెనకాల గోడకు అంటించి ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ పోస్టర్ను అకారణంగా చించి వేశాడు. ఇదేమని అడిగిన విద్యార్థులను, లెక్చరర్లను బెదిరించాడు. దీంతో విద్యార్థులు జై తెలంగాణ నినాదాలతో గదుల్లోకి వెళ్లి కిటికిల అద్దాలు, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కళాశాల లెక్చరర్లు పోస్టర్ను ఎందుకు చించావని అడిగితే మిమ్ములను కూడా అదే విధంగా చించేస్తానని తననెవరు అడగొద్దని హెచ్చరించాడు.
దీంతో విషయం తెలుసుకున్న ఆ కళాశాలకు చెందిన తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి వచ్చి కళాశాల ముందు బైఠాయించి సాయంత్రం వరకు సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డిపై ముష్టిఘాతాలు కురిపించారు. పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వెంబడించి మరీ చితకబాదారు. పోలీసులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
కెపిహెచ్బి పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంచేయగా తెలంగాణ వాదులు ససేమిరా అంటూ బెఠాయించారు. దీంతో ఆ నగరంలోని ఆ కళాశాలల ఇన్చార్జి, డైరెక్టర్లను కెపిహెచ్బి సిఐ బస్వారెడ్డి పిలిపించారు. ఆచార్య జయశంకర్ పోస్టర్ను చింపిన వైస్ ప్రిన్సిపల్ను వెంటనే సస్సెండ్ చేస్తున్నామని అదే విధంగా బాలికల జూనియర్ కళాశాలలో పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.