గాలి లాకర్లు తెరిచిన ఎసిబి: భార్యను ప్రశ్నించే అవకాశం
గాలితో పాటు పలువురి ఖాతాల లావాదేవీలను పరిశీలించారు. జనార్దన రెడ్డి డ్రైవర్లు, ఇంటి పనివారు, గనుల్లో మేనేజర్ల పేర్లతో యాక్సిస్ బ్యాంకులో 200 లాకర్లున్నాయని, వాటిలో ఆభరణాలు, వజ్రాలు దాచారని సీబీఐకి సమాచారం ఉంది. తాజాగా ఈ బ్యాంకుల్లో పెద్ద మొత్తం లో నగదు డ్రా చేసిన వివరాలను ఏసీబీ సేకరించింది. గాలి సోదరుడు సోమశేఖర్రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్బాబుల గన్మెన్ను అధికారులు ప్రశ్నించారు.
అలాగే ఎమ్మెల్యేల బాడీగార్డులు నాగరాజు, మంజునాథ్, బసవరాజ్లను కూడా విచారించినట్లు తెలిసింది. నేతల కారు డ్రైవర్లను కూడా ప్రశ్నించి అత్యంత కీలక సమాచారం రాబట్టారని తెలిసింది. జనార్దనరెడ్డి భార్య అరుణనూ ఎసిబి విచారించే అవకాశముంది. మరోవైపు శుక్రవారం సండూరు కోర్టుకు గాలిని తరలించారు. 2008లో మైనింగ్ కేసు విషయంలో ఆయనను కోర్టు విచారించనుంది. ఇందుకోసం గురువారం రాత్రే బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలునుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో జైలు దగ్గరకు భారీగా జనం తరలివచ్చారు. అయితే, రాత్రి 9:00 గంటలకు అధికారులు ఆయనను జైలుకు తీసుకురాగా ఎవరితో మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు.
పట్టాభికి నో బెయిల్
కాగా బెయిల్ ముడుపుల కేసులో ప్రధాన నిందితుడైన మాజీ జడ్జి పట్టాభిరామారావు బెయిల్ పిటిషన్ను ఎసిబి ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. వాదనలు విన్న అనంతరం జడ్జి జగన్నాథం దర్యాప్తు అధికారులతో ఏకీభవించారు. దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరిని విచారించాల్సి ఉన్నందున పట్టాభికి బెయిల్ ఇవ్వడం సరికాదని ఎసిబి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారని, పట్టాభి వయస్సు, అనారోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ లాయర్ వాదించారు.
ఇదే కేసులో నిందితుడైన దశరథరామిరెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ 21కి వాయిదా పడింది. ఇక ఈ కేసులో అరెస్టయిన రిటైర్డ్ జడ్జి చలపతి రావు, పట్టాభి కుమారుడు రవిచంద్రలకు 60రోజుల కస్టడీ పూర్తయినందున సెక్షన్ 157(2) ప్రకారం బెయిలివ్వాలని వారి తరఫు లాయర్లు వాదించారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.