ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్..!
బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో తలెత్తిన తిరుగుబాటు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇప్పటికే అసెంబ్లీలో మమతా బెనర్జీ సూచించిన ఎమ్మెల్యే శోభన్ దేవ్ ఛటర్జీకి కాకుండా ఆమె పార్టీ నుంచి బహిష్కరించిన రితబ్రత బెనర్జీకి విపక్ష నేత పదవిని స్పీకర్ కట్టబెట్టారు. ఇప్పుడు లోక్ సభలోనూ ఎంపీలు చీలిపోయి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో 28 మంది ఎంపీలు గెలిచారు. వీరిలో దాదాపు 22 మంది ఎంపీలు రెబెల్స్ గా మారిపోయారు. వీరంతా ఎన్డీయేకు మద్దతుగా ఉంటామని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లోక్ సభ స్పీకర్ ను ఇవాళ కోరారు. సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో వీరంతా ఢిల్లీలో బీజేపీ నేతల్ని కలిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. తమను లోక్ సభలో ప్రత్యేక వర్గంగా గుర్తించాలని వీరు స్పీకర్ కు లేఖ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వీరి దూకుడును అడ్డుకునేందుకు తుది ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎంపీల్ని ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అలా గుర్తించే వీలు లేదని, ఏదైనా పార్టీలో విలీనం కాకుండా వీరిని ప్రత్యేక వర్గంగా గుర్తించరాదని తెలిపారు.

టీఎంసీని, దాని లోక్ సభా పక్ష నాయకుడు, విప్ ద్వారా మాత్రమే సభలో ప్రాతినిధ్యం వహించే ఒకే రాజకీయ పార్టీగా పరిగణించాలని, తమ పార్టీకి చెందిన ప్రత్యేక సమూహంగా లేదా వర్గంగా చెప్పబడుతున్న దేనికైనా ఎలాంటి గుర్తింపు, హోదా లేదా సౌకర్యం కల్పించడానికి నిరాకరించాలని కోరారు. పైన పేర్కొన్న స్వభావం గల ఏదైనా సమాచారం అందినట్లయితే, దానిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు టీఎంసీకి తన వాదన వినిపించే అవకాశం కల్పించాలన్నారు. ఇందులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించే ఏ ప్రవర్తనకైనా సంబంధించి, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద తగిన చర్యలు ప్రారంభించే హక్కుతో సహా, టీఎంసీ తన హక్కులను కాపాడుకుంటుందని తెలిపారు.














Click it and Unblock the Notifications