పవర్ కట్కు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆదా మంత్రం
రాష్ట్ర ప్రభుత్వ ఆలసత్వం లేదని, విద్యుత్తు లేదని, ఉండి ఇవ్వడం లేదని, రోడ్డుపై కూర్చుంటే, ధర్నాలు చేస్తే విద్యుత్తు రాదని ఆయన అన్నారు. సబ్ స్టేషన్లను ధ్వంసం చేస్తే నష్టమే తప్ప లాభం లేదని ఆయన అన్నారు. తమకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. ఉత్పత్తి రోజుకు 48 మిలియన్ యూనిట్లు తగ్గిందని, ఇంత పెద్ద మొత్తం తగ్గుతుందని ఊహించలేదని, దానివల్లనే సమస్య తీవ్రమైందని ఆయన అన్నారు. రోజుకు నిరుడు 234 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఇప్పుడు 212 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు.
రోజుకు నిరుడు 35.46 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 6.33 మిలియన్ యూనిట్లుమాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. గ్యాస్ ద్వారా నిరుడు 42.43 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 19 మిలియన్ యూనిట్లు తక్కువగా ఉత్పత్తి అవుతోందని ఆయన అన్నారు. ఈ రెండు రంగాల్లోనూ ఉత్పత్తి తగ్గిందని ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యను అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రోజుకు నిరుడు 16 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 28.6 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్ కొనుగోలుకు రోజుకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరో 500 మెగావాట్ల విద్యుత్తు తమకు కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన చెప్పారు. కేటాయింపులు జరపకుండా 300 మెగావాట్ల విద్యుత్తు ఉందని, దాంట్లోంచి వీలైనంత మేరకు మన రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. నైవేలీ రెగ్యులేటరీ కార్పొరేషన్ నుంచి 75 మెగావాట్ల విద్యుత్తును కోరుతున్నామని ఆయన చెప్పారు.
కాప్టివ్ విద్యుదుత్పత్తిని, సంప్రదాయేతర ఇంధనవనరుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాప్టివ్ వినియోగానికి జరిపే విద్యుదుత్పత్తిపై ఉన్న డ్యూటీని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సోలార్, విండ్, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహంచడానికి వాటిపై చార్జీలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో తలసరి వినియోగం కూడా 604 యూనిట్ల నుంచి 1050 యూనిట్లకు పెరిగిందని, కొరతకు ఇది కూడా ఒక కారణమని ఆయన చెప్పారు.