తప్పించుకొని మళ్లీముట్టడికి కెటిఆర్, కోదండరాం అండ
పోలీసులు వారిని అడ్డుకొని కెటిఆర్ సహా పలువురిని అరెస్టు చేశారు. అయితే ఆ తర్వాత కెటిఆర్ వారి నుండి తప్పించుకొని వచ్చి మళ్లీ మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యేల అరెస్టును తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఖండించారు. మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదన్నారు.
అరెస్టైన తెరాస ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలుపుతామని, టిడిపి ఎమ్మెల్యేల విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజా సమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారన్నారు. కరెంట్ సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడుతానని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కోదండరామ్ అంతకుముందు సబితా ఇంద్రా రెడ్డితో భేటీ అయ్యారు.
తెరాస ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని, అవసరమైతే కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు దేవిశ్రీ ప్రసాద్, విఠల్, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాగా అరెస్టైన ఎమ్మెల్యేలలో దాస్యం వినయ భాస్కర్, ఏనుగు రవీందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు జైలు నుండి విడుదల కానున్నారు. హరీష్ రావు తదితర ఎమ్మెల్యేల అరెస్టుపై నార్త్ జోన్ డిసిపి శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారిని తాము నిన్ననే విడుదల చేశామని, వారే బలవంతంగా పిఎస్ ప్రాంగణంలో కూర్చున్నారన్నారు. కాగా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరును వారు స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నారు.