ఏపీపై ఉపరితల ఆవర్తనం: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం ఉండొచ్చు. పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడొచ్చు.
ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఈదురుగాలులు సైతం బీభత్సాన్ని సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పలకరించాయి.

ఇదే పరిస్థితి.. నేడు కూడా కొనసాగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈదురుగాలులు వీస్తున్నప్పుడు గానీ, పిడుగులు పడుతున్నప్పుడు గానీ శిథిల నివాసాలు, గోడలు, చెట్లు, హోర్డింగుల కింద తలదాచుకోవద్దని చెప్పారు.












Click it and Unblock the Notifications