రాజకీయ హత్యలకైనా దిగుతాం: తెలంగాణపై నారాయణ
తెలంగాణపై కేంద్రం మోసపూరిత వైఖరి వల్ల వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇక నుంచి అలా చేసుకోరని, అవసరమైతే రాజకీయ హత్యలకు సిద్ధపడతామని ఆయన పోరుయాత్ర సభలో అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాలయాపన చేస్తే కాంగ్రెసు ఆత్మహత్య చేసుకునే వరకు ఉద్యమాన్ని సాగిస్తామని ఆయన చెప్పారు. ఇక్కడ మీసాలు తిప్పే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోనినయమ్మను చూడగానే జడుసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నాగర్కర్నూల్ శివారులో పార్టీ రాష్ట్ర నాయకులు చాడ వెంకట్రెడ్డి, పల్లె వెంకట్రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. స్వయంప్రతిపత్తి గల కాగ్ ప్రధానికి వ్యతిరేకమైన నివేదిక ఇస్తే అందుకు నైతిక బాధ్యత వహించాల్సింది పోయి కాగ్కు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
కాగ్ ఏమైనా భగవద్గీతా అంటూ వ్యాఖ్యానిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అవినీతిని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. తన మంత్రివర్గంలో ఏడుగురు కళంకిత మంత్రులున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనక కిరణ్కుమార్రెడ్డి ప్రోత్సాహం ఉందన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించకుండా ఢిల్లీస్థాయిలో కిరణ్కుమార్రెడ్డి ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.
ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్, బొగ్గు సరైన రీతిలో కేటాయించని కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికే సర్చార్జి పేరిట రూ.14వేల కోట్ల భారం మోపిన ప్రభుత్వం రూ.2,100కోట్లు వడ్డించడానికి సిద్ధంగా ఉందని, దీన్ని తీవ్రంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.