పాదయాత్రకు చంద్రబాబు రెడీ: తెలంగాణపై కసరత్తు
చంద్రబాబు పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు సాగుతుంది. దాదాపు 2,340 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రను ప్రారంభించేలోగా తెలంగాణపై కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాత తన పాదయాత్రను వరంగల్ నుంచో, కరీంనగర్ నుంచో ప్రారంభించాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
"పాదయాత్ర అయితేనే మంచిదనిపిస్తోంది. ప్రజల్లోకి మరింతగా వెళ్లడానికి నడుస్తూ వెళ్తేనే బాగుంటుంది. నా యాత్ర పార్టీకి ఒక స్ఫూర్తి. పార్టీలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు తర్వాత పాదయాత్రతో తమ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం సందర్శించి ప్రజలను కలవాలి. అప్పుడు మరింతగా ప్రజల్లో మమేకం కాగలుగుతాం'' అని ఆయన అన్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకూ మొదటి విడత, 20 నుంచి 24వరకూ రెండో విడతలో పార్టీ మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని, 25 నుంచి జిల్లా కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన వారిని కోరారు.
బీసీ డిక్లరేషన్కు ఢిల్లీలో కూడా మంచి స్పందన లభించిందని చెప్పిన ఆయన దీనిని పార్టీ వర్గాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. పార్టీకి చెందిన 1500మంది క్రియాశీలక కార్యకర్తలకు ఫోన్ చేయించి సర్వే చేయించానని, అందులో 600మంది మాత్రమే బీసీ డిక్లరేషన్ గురించి తెలుసునని చెప్పారని వివరించారు.
మన పార్టీలో క్రియాశీల సభ్యులకే పూర్తిగా తెలియకపోతే సామాన్యులకు ఇవి ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. గ్రామాల్లోని బీసీ వర్గాలకు మన డిక్లరేషన్లోని అంశాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. మన పార్టీలో బలహీనులు, ఇబ్బందుల్లో ఉన్నవారిని ప్రలోభపెట్టి జగన్ పార్టీ నేతలు తమవైపు లాక్కొంటున్నారని అన్నారు.