ప్రస్తుతానికి సిఎం సేఫ్: తెరాస విలీనంపైనే చర్చలు
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తమ పార్టీలో విలీనం చేసుకోవడంపైనే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో అధిష్టానం పెద్దలు వరుసగా చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ, ఆ మేరకు ప్రకటన చేయడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెరాసను తమ పార్టీలో విలీనం చేయడానికి కెసిఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ పరిస్థితిపై తెలుసుకోవడానికి ఆయనను ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నుంచి వచ్చే స్పందనపై కూడా కాంగ్రెసు అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ నుంచి కూడా సోనియా ఆ వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి కూడా రంగం సిద్దమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో చిరంజీవికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. పార్టీని రక్షించుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం తప్ప మార్గాంతరం లేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది.
ఇదిలావుంటే, విలీనం వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాతనే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ప్రకటన వెలువరించే తరుణంలో దాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.