హైదరాబాద్కు చెడ్డపేరొస్తుంది! మాట్లాడతా: నరసింహన్
వారి విజ్ఞప్తిపై స్పందించిన గవర్నర్ అక్టోబర్ 1 నుండి జీన వైవిధ్య సదస్సు ఉందని, ప్రభుత్వం దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కాబట్టి కవాతును వాయిదా వేసుకోవాలని సూచించారు. జీవ వైవిధ్య సదస్సుకు ఆటంకం కలిగితే హైదరాబాదుకు చెడ్డపేరు వస్తుందన్నారు. అందుకు స్పందించిన నేతలు తాము గాంధేయ పద్ధతిలోనే తమ ఆకాంక్షను తెలియజేస్తామన్నారు. దీంతో గవర్నర్ తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈ విషయమై మాట్లాడుతానన్నారు.
గవర్నర్ను కలిసిన అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం రాజకీయ పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. కవాతులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయని, శాంతియుతంగా కవాతు నిర్వహిస్తామని, తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. జీవ వైవిధ్య సదస్సు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం అయితే తమకు తెలంగాణ ప్రతిష్టాత్మకం అని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు తమకు ఇవ్వాలన్నారు. కవాతును పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీసాలు, ట్రాన్సుపోర్టులు, బైండోవర్లు, అరెస్టులు అంటూ తెలంగాణవాదులను భయాందోళనకు గురి చేయవద్దన్నారు. కవాతు శాంతియుతంగా జరగాలంటే అనుమతివ్వాలన్నారు. కవాతుపై గవర్నర్, డిజిపిల అపోహలు తొలగిస్తామని ఈటెల రాజేందర్ అన్నారు. తామంతా ముందు నిలబడి కవాతును ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామన్నారు.
ఐకాస మాటిచ్చినట్లుగా తాము గాంధేయ పద్ధతిలో నిరసన తెలుపుతామన్నారు. కవాతును మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు నిర్వహిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శాంతియుతంగానే తాము దీనిని చేపడతామన్నారు. తాము కవాతులో పాల్గొంటామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.