ఓయు గేట్కు తాళం: రాళ్ల వర్షం, బాష్పవాయుప్రయోగం
తాము జలదృశ్యం వరకు వెళ్లి కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించి వెనక్కి వస్తామని, కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్థులు చెప్పారు. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తాము ర్యాలీని అనుమతించే ప్రసక్తి లేదని పోలీసులు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎన్సిసి గేటుకు తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఉస్మానియా మహిళా హాస్టల్ వద్ద విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు వారి పైకి బాష్పవాయువు ప్రయోగించారు. అంతకుముందు విద్యార్థులు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు వల్లనే హింస జరుగుతోందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. తీరు మార్చుకోకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు చెప్పారు.
కాగా విశ్వవిద్యాలయం ఆవరణలోకి పోలీసులు ప్రవేశించకూడదని విసి సర్క్యులర్ జారీ చేశారు. పోలీసులు గేట్లు మూశారు. తెలంగాణ మార్చ్ను ముందుండి నడిపించాల్సిన రాజకీయ నాయకులు పారిపోయారని తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అన్నారు. మార్చ్ను శాంతియుతంగా నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్దని ఆయన అన్నారు.