మంత్రి పార్థసారథిపై కేసు నమోదు, విచారణ కోసం...
కాగా మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచి పెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కు సమర్పించిన తన అఫిడవిట్లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.
కేసు నమోదై ఇప్పుడు నేరం రుజువైంది కనుక(రెండో నిందితుడు) పార్థసారథిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అప్పుడే వార్తలొచ్చాయి.ఈ విషయమపై ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు.
ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు. పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆర్థిక నేరాల కోర్టు గతంలో నిర్ధారించిన విషయం తెలిసిందే. కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ కంపెనీ పేరుతో మిషనరీ కొన్న పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోర్టు అతనికి రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.