లగడపాటి బఫూన్, కెసిఆర్ చర్చలు నిజమే: పాల్వాయి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను ఢిల్లీ నేతలు ఒక జోకర్గా పరిగణిస్తున్నారన్నారు. సీమాంధ్రనేతలు ఢిల్లీలో చేస్తున్న కుతంత్రాల వల్లనే తెలంగాణ అంశం ఎప్పటికప్పుడు వాయిదా పడుతుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రంలో అధిష్ఠానం సానుకూలంగా ఉందనేందుకు ఏఐసీసీ నేత జనార్ధన్ త్రివేది చేసిన వ్యాఖ్యలు నిదర్శమన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం మొదటి దఫాగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో చర్చలు ముగిశాయని, రెండో దఫా చర్చలు కూడా జరుగుతాయని చెప్పారు. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసినట్లయితే తెరాసను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాననడం వాస్తవమన్నారు.
రెండు నెలల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుందని తెలిపారు. తెలంగాణ మార్చ్ను సీమాంధ్ర పోలీసులు, మంత్రులు విఫలం చేయడానికి ప్రయత్నించారని, అయినప్పటికీ తెలంగాణ ప్రజలు అన్నింటిని ఎదుర్కొని తెలంగాణ మార్చ్ను విజయవంతం చేశారని కేంద్రంలోని హోంశాఖా మంత్రి కూడా అంగీకరించారని అన్నారు.