"నీ గుట్టు అంతా నాకు తెలుసు": బుడ్డోడికి ఇషాన్ కిషన్ వార్నింగ్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకాలలో ఒకటిగా తన పేరును లిఖించుకున్నాడు. మొత్తం 37 బంతుల్లో 103 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ సాయంతో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అయితే ఇంతటి భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఛేదించింది. ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 74 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. అభిషేక్ శర్మ (57) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ధాటికి సన్రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. చిన్నవాడైన వైభవ్ అద్భుత బ్యాటింగ్ను ఇషాన్ అభినందిస్తూనే.. సరదాగా అతడిని హెచ్చరించాడు.

ఇషాన్ కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే భయం వేసింది. అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 258కి చేరుకునేది. సాకిబ్ హుస్సేన్ అతడిని ఔట్ చేయడంతో మేము ఊపిరి పీల్చుకున్నాం. అతను బ్యాటింగ్ చేస్తున్న పిచ్చి వేగం గురించి మాట్లాడుతూ.. వచ్చేసారి మా జట్టుతో ఆడేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఆడమని చెప్పాను. నీ రహస్యాలన్నీ, నీ ఇన్సైడ్ స్టోరీలన్నీ నాకు తెలుసు అని అతడిని సరదాగా ఆటపట్టించాను" అని జియో హాట్స్టార్తో జరిగిన చర్చలో వెల్లడించాడు.
ఇదే క్రమంలో ఇషాన్ కిషన్ తన టీమిండియా రీ-ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున 500కు పైగా పరుగులు చేసి, మళ్లీ జాతీయ జట్టులోకి రావడం గురించి వివరిస్తూ.. జట్టులో చోటు కోల్పోయినప్పుడు ఏడవడం లేదా బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నాడు. "జట్టులో చోటు సంపాదించాలంటే పరుగులే ఏకైక మార్గం. 300 పరుగులు సరిపోకపోతే 400 చేయాలి, అది కూడా చాలకపోతే 500 చేయాలి. కష్టపడటం తప్ప మరో దారి లేదని నాకు నేను చెప్పుకున్నాను" అని ఇషాన్ కిషన్ తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్నాడు.












Click it and Unblock the Notifications