Rahul Gandhi: స్వాతంత్ర దిన వేడుకల్లో రాహుల్ సీటు అక్కడే..! కేంద్రం క్లారిటీ..!
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్రం గతేడాది జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో (Independence Day Event) ఐదో వరుసలో సీటు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని తర్వాత కేబినెట్ మంత్రి హోదా కలిగిన విపక్ష నేత రాహుల్ కు ఐదో వరుసలో సీటు కేటాయింపు వివాదాస్పదమైంది. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాహుల్ గాంధీకి ఈసారి స్వాతంత్ర వేడుకల్లో సీటు ఎక్కడ కేటాయిస్తున్నారంటూ కేంద్రాన్ని (Centre) పార్లమెంట్ లోనే ప్రశ్నించింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమాధానం ఇచ్చింది. ఈసారి విపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రుల తర్వాత సీటు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది ప్రధాని, మంత్రుల తర్వాత కూడా రాహుల్ గాంధీకి సీటు కేటాయించకుండా ఎక్కడో ఐదో వరుసలో కూర్చోబెట్టడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈసారి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకుడిని స్వాతంత్ర వేడుకలకు ఆహ్వానించామని, ఆయన సీటు నిబంధనల ప్రకారమే కేటాయిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 ప్రకారం లోక్ సభ, రాజ్యసభలో విపక్ష నేతలకు జాతీయ స్దాయి కార్యక్రమమైన స్వాతంత్ర దినోత్సవంలో లోక్ సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధానమంత్రుల తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రులతో కలిపి కూర్చొనేలా కేటాయించాల్సి ఉంటుంది. ఈసారి దీని ప్రకారమే రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు చేస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాహుల్ గాంధీ సీటు వివాదంపై వస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది. తద్వారా స్వాతంత్ర దినోత్సవ వేడుకను సైతం వివాదాస్పదం చేస్తున్నారన్న అపప్రద నుంచి కేంద్రం బయటపడింది.




Click it and Unblock the Notifications