రాహుల్ గాంధీ వీడియోకు లక్షల్లో వ్యూస్- ఫుల్ వైరల్: కేంద్రంపై అసంతృప్తి
దేశంలో వాహనదారులను ఇథనాల్ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి (E20) పెంచడం వల్ల పాత వాహనాల మైలేజ్ తగ్గుతోంది. ఇంజిన్ దెబ్బతింటోంది. 2023 కంటే ముందు తయారైన నాన్-ఈ20 వాహనాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందంటూ సర్వేలు సైతం తేల్చి చెబుతున్నాయి. ఇది ఇంధన సామర్థ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇంజిన్ దీర్ఘకాలిక మనుగడను దెబ్బ తీస్తోందని స్పష్టం చేస్తోన్నాయి.
ఈ అంశంపై దేశవ్యాప్త పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ వెనుక భారీ ఎత్తున అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ఆమ్ ఆద్మీ, ఇతర ఇండియా బ్లాక్ పార్టీలను కలుపుకెళ్తోందీ విషయంలో ఇప్పటికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా దీనిపై గళం ఎత్తింది కూడా. ఈ అక్రమాలపై త్వరలోనే ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్.

దీనిపై రాహుల్ గాంధీ ఓ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేశారు. తన ఇంటి ఆవరణలో ఓ కారు పక్కన నిల్చుని ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ20 అంశాన్ని ప్రస్తావించారు. సాధారణంగా ఏదైనా వ్యవహారంలో మోసం జరిగితే దాల్ మే కుచ్ కాలా హై అని అంటుంటామని, ఈ ఈ20 పెట్రోల్ వ్యవహారం దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని, ఇక్కడ వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందని వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పెద్దలు మాత్రమే లబ్ధి పొందుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచేంత వరకూ దీనిపై పోరాటం సాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. భారీ ఎత్తున ప్రజా పోరాటాలు చేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నామని పేర్కొన్నారు. దీని నుంచి కేంద్రం వెనక్కి తగ్గేంత వరకూ వదలబోమని అన్నారు.
E20 - दाल में काला नहीं, पूरी दाल ही काली है। pic.twitter.com/Unw7UfNt9k
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2026
ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫేస్ బుక్ లో 10,00,000మందికి పైగా యూజర్లు ఈ వీడియోను చూశారు. రియాక్ట్ అయ్యారు. 28,000 వరకు వేర్వేరు ఎమోజీలతో తమ స్పందన తెలియజేశారు. 28,000 వరకు కామెంట్స్ పోస్ట్ అయ్యాయి. అదే స్థాయిలో ఈ వీడియోను షేర్ చేశారు నెటిజన్లు. ఇదే వీడియోను ట్విట్టర్ లో 64,00,000 వ్యూస్ లభించాయి. 18,000 మంది ట్విట్టరెటీలు దీన్ని రీపోస్ట్ చేశారు. ఇది.. ఇథనాల్ పై గానీ, కేంద్ర ప్రభుత్వంపై గానీ నెలకొన్న అసంతృప్తికి అద్దం పట్టినట్టయింది.



Click it and Unblock the Notifications