నితీష్ కుమార్పై కుర్చీ విసిరిన యువకుడు
ర్యాలీ వేదిక వద్దకు వస్తున్న నితీష్ కుమార్ కోసం నిరీక్షిస్తున్నవారిలో ఆ యువకుడు కూడా ఉన్నాడు. అధికార యాత్రలో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన ర్యాలీకి, కాన్వాయ్కి హింస, విషాదకరమైన సంఘటనలు ప్రత్యేక ప్రతిపత్తిని చేకూరుస్తున్నట్లున్నాయి.
కారు దిగి వేదికపైకి వెళ్తుండగా నితీష్ కుమార్పైకి ఓ యువకుడు ప్లాస్టిక్ కుర్చీ విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే, ఆ కుర్చీ నితీష్ కుమార్కు తాకలేదు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటనను జనతాదళ్ (యునైటెడ్) ఖండించింది. దాడిలో కుట్ర ఉందని, కుర్చీ విసిరిన యువకుడు రాష్ట్రీయ జనతాదళ్ కార్యకర్త అని జెడి (యు) నాయకుడు నీరజ్ కుమార్ అన్నారు. నిరసనకారులు హింసకు దిగడం రాష్ట్ర సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి అవాంఛనీయమని అంతకు ముందు నితీష్ కుమార్ అన్నారు.
తన మోటార్కేడ్పై నిరసనకారులు రాళ్లు విసిరారని, తనపై దాడికి ప్రయత్నించారని, బీహార్ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.