సోనియానే ధిక్కరించారు: కిరణ్ రెడ్డిపై డిఎల్ ఫైర్
గ్యాస్ సిలిండర్ల విషయంలో ముఖ్యమంత్రి వైఖరి పార్టీ మనుగడకే నష్టమని అన్నారు. తొమ్మిది సిలిండర్లు ఇవ్వకపోతే మంత్రివర్గంలో ఉండనని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. సోనియాగాంధీ ఆశీస్సులతోనే ఉన్నత స్థానంలోకి వస్తారని, వస్తూనే ఆమె ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం 'దీపం' గ్యాస్ కనెక్షన్లను మహిళా సంఘాలకు అందచేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తొమ్మిది సిలిండర్లను ఇవ్వాలని, వాటికయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సోనియాగాంధీ స్పష్టంగా ఆదేశించారని ఆయన చెప్పారు.
కానీ, మన రాష్ట్రంలో సోనియా ఆదేశాలను పాటించడం లేదని ఆయన అన్నారు. "ఆమె ఆదేశిస్తేనే ఉన్నత పదవి చేపట్టిన ఆయన ఇప్పుడు గ్యాస్పై నిర్ణయం తీసుకోకుండా ధిక్కరిస్తున్నారు'' అని సీఎం కిరణ్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తొమ్మిది సిలిండర్లు ఇవ్వకపోతే మంత్రివర్గంలో ఉండనని చెప్పారు. చాలా కాలంగా ముఖ్యమంత్రిపై డిఎల్ రవీంద్రా రెడ్డి గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.