తెలంగాణపై కేంద్రమంత్రిగా చిరంజీవి స్పందన: పవన్పైనా
కేంద్రమంత్రిగా ప్రస్తుతం తెలంగాణపై తన వ్యక్తిగత అభిప్రాయం అప్రస్తుతం అన్నారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని మాత్రం తాను కోరుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలల పాదయాత్రల పైనా చిరు స్పందించారు.
పాదయాత్రలు ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంతో చేస్తే తప్పు లేదని, కానీ రాజకీయ లబ్ధి కోసమైతేనే ప్రజలను మోసం చేసినట్లు అవుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమైతే ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారన్నారు. అలా పాదయాత్ర చేసే వారు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. మంత్రి పదవి లేటుగా వచ్చినా లేటెస్టుగా బాధ్యతలు నిర్వహిస్తానని చిరంజీవి అన్నారు. మంత్రివర్గంలో అనుభవం ఉన్న వాళ్లకి, యువతకి పెద్ద పీట వేశారన్నారు.
2014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అందరం కృషి చేస్తామన్నారు. తన మద్దతుదారులు, కాంగ్రెసు ఓటు బ్యాంకుతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. తన మద్దతుదారులకు పదవులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, బలరాం నాయక్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెసు పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందనేది అర్థమవుతోందన్నారు.
తనకు పదవి వచ్చినందుకు సహకరించిన సోనియా గాంధీ, కేంద్రమంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ అందరికీ కృతజ్ఞతలు అన్నారు. దీనిని తాను హోదాగా భావించడం లేదని, బాధ్యతగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. తనకు ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖ పరిధి మేరకు న్యాయం చేస్తానన్నారు. తనకు శాఖ విషయంలో స్పష్టత లేదని, అయితే మీడియాలో మాత్రం పర్యాటక శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు.
అదే నిజమైతే.. పర్యాటకులను ఎలా ఆకర్షించేందుకు కృషి చేస్తానని చెప్పారు. దేశంలో పర్యాటకరంగానికి అన్ని హంగులు ఉన్నాయని, దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతముందని, పీరియడ్ తక్కువ ఉన్నా తన పని తీరు చూపిస్తానన్నారు. ఆ విశ్వాసం తనకు ఉందన్నారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. కొందరు కాంగ్రెసు పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తాను నిజాలు తెలియజేస్తానన్నారు.
తాను కాంగ్రెసు పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. తాను సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించే అవకాశముందన్నారు. కొత్తమంత్రివర్గంలోకి యువతను, అనుభవమున్న వారిని తీసుకు వచ్చారన్నారు. 2014లో పార్టీని అధికారంలోకి అందరం కలిసి తీసుకు వస్తామన్నారు.
కాంగ్రెసు పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందని కిల్లీ కృపారాణి అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర నుండి గతంలో బొత్స సత్యనారాయణను పిసిసి చీఫ్గా చేసిన సోనియా గాంధీ, ఇప్పుడు తనను కేంద్రమంత్రిగా చేశారన్నారు. తాను మొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేయడం వల్లనే ఈ పదవి వచ్చిందన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.