ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఆపలేరు: షర్మిల
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె అన్నారు. ఎంతో మందికి ప్రాణబిక్ష ప్రసాదించిన వైయస్సార్ మానసపుత్రిక 108 ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరో ఆరు నెలలు బతికి ఉంటే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవారని షర్మిల అన్నారు. అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి నీచమైన కుతంత్రాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు షర్మిల సోమవారంనాడు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రాగులపాడు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పందిపాడు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెసు, తెలుగుదేశం చీకటి ఒప్పందం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని విమర్శించారు.
చంద్రబాబు మీద కేసులు పెట్టరు, విచారణలు జరిపించరని ఆమె అన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరని, ఇది కాంగ్రెసు తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన చీకటి ఒప్పందమని ఆమె అన్నారు. అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు.