బాలిక కిడ్నాప్, పెళ్లికి యత్నం: డాక్టర్ పరారీ
పోలీసుల కథనం ప్రకారం - పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన యునానీ వైద్యుడు హరినాథ్ అలియాస్ జయంత్ (52) గత ఐదు నెలలుగా మహబూబ్నగర్ సమీపంలోని న్యూగంజ్ గ్రామంలో ఉంటున్న విజయమోహన్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేస్తున్నాడు. చికిత్స చేసే క్రమంలో జయంత్ విజయమోహన్ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు.
తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలంటే వివిధ ఆలయాల్లో పూజలు చేయాలని నమ్మించిన విజయమోహన్ 14 ఏళ్ల కూతురును తన వెంట తీసుకుని వెళ్లాడు. అతన్ని నమ్మి బాలిక ఆగస్టు 30వ తేదీన అతనితో పాటు బెంగళూర్ వెళ్లింది. తమ కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు మహబూబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వైద్యుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
వైద్యుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. లుకవుట్ నోటీసులు జారీ చేశారు. సమాచారం ఇచ్చిన వారికి అవార్డు ప్రకటించారు. ఈలోగా అక్టోబర్ 30వ తేదీన విజయమోహన్ మరణించాడు. నవంబర్ 2వ తేదీన యునానీ వైద్యుడు పోలీసులకు ఫోన్ చేసి బాలిక ఉడుములపేటలోని యూనివర్సల్ ఫౌండేషన్ ఆశ్రమంలో ఉందని చెప్పాడు.
పోలీసులు అక్కడికి వెళ్లి బాలికను గుర్తించారు. యునానీ వైద్యుడి జాడ మాత్రం కనిపించలేదు. తనను వైద్యుడు పెళ్లి చేసుకున్నాడని బాలిక పోలీసులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత మంగళసూత్రాన్ని తీసి పారేసింది. అయితే, తనపై లైంగిక దాడి జరగలేదని బాలిక చెప్పింది. తన కూతురు అని చెప్పి వైద్యుడు ఆశ్రమ నిర్వాహకులకు చెప్పి వదిలి వెళ్లాడు. మగపోలీసులు మాత్రమే రావడంతో స్థానిక పోలీసులు బాలికను వారి వెంట పంపించడానికి నిరాకరించారు.