చంద్రబాబూ! క్లారిటీ ఇవ్వండి: మైసురా రెడ్డి డిమాండ్
ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చంద్రబాబు తన పాదయాత్రలో ప్రతి చోటా చెబుతున్నారని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. అవిశ్వాసంపై ఒంకరిటింకరి మాటలు, అయోమయ ప్రకటనలు చేయవద్దని అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి శాసనసభా సమావేశాలు జరగడం లేదని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేస్తూ అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
తమకు సంఖ్యా బలం ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఉండేవాళ్లమని, బలప్రదర్శనకూ అవిశ్వాసానికీ మధ్య తేడా ఉందని మైసురా రెడ్డి అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి సందర్భంలో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రతిపాదించడానికి తెలుగుదేశం ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా చెబుతోందని, తమ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తాము ప్రజల నుంచే అధికారం పొందుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ధైర్యం లేకనే చంద్రబాబు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నేరుగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని మైసురా రెడ్డి డిమాండ్ చేశారు.