అజ్మల్ కసబ్: 26/11 టు ఉరి, కేసు తీరు సాగిందిలా...
న్యూఢిల్లీ: ముంబయి మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్కు ప్రభుత్వం బుధవారం(21 నవంబర్ 2012) రోజు ఉరిశిక్షను అమలు చేసింది. పూణేలోని ఎరవాడ జైలులో ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో గోప్యంగా ఉరి తీసింది. 13 సెప్టెంబర్ 1987లో పాకిస్తాన్లోని ఫరీద్కోటలో జన్మించిన కసబ్ ఈ రోజు పూణేలో అతను చేసిన ఆకృత్యానికి కాస్త ఆలస్యంగానైనా ఫలితం అనుభవించాడు.

2008 నవంబర్ 26 పదిమంది లష్కరే తోయిబా తీవ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై దాడులు చేశారు. ఈ దాడిలో విదేశీయులు సహా 166 మంది మృతి చెందారు.

మన ఎన్ఎస్జి కమాండ్స్ ఎదురు దాడికి దిగి జరిపిన కాల్పుల్లో 9 మంది తీవ్రవాదులు మృతి చెందారు. అజ్మల్ కసబ్ ఒక్కడే నవంబర్ 28న అర్ధరాత్రి సమయంలో సజీవంగా పట్టుబడ్డాడు.

అజ్మల్ కసబ్ విచారణలో, కోర్టులో తాను తీవ్రవాదిని కానని, బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు వచ్చానని తప్పించుకోజూశాడు. ఆ తర్వాత అతను తన తప్పును ఒప్పుకున్నాడు.

తాను పేద కుటుంబం నుండి వచ్చానని, ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడనయ్యానని కసబ్ చెప్పాడు.

అజ్మల్ కసబ్ ఇన్ని రోజులు ముంబయి ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.

రెండు రోజుల క్రితమే ఉరి తీసేందుకు పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు.

కసబ్ లాయర్గా ఏప్రిల్ 1, 2009లో అంజలి వాంగ్మేర్ అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 15, 2009లో తొలగించబడ్డారు. 16న అబ్బాస్ కజ్మి లాయర్గా అపాయింట్ అయ్యారు.

అజ్మల్ కసబ్ను నవంబర్ 21, 2012న పూణేలోని ఎరవాడ జైలులో ఉదయం ఏడున్నర గంటలకు ఉరి తీశారు. పాక్ అతని మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఎరవాడ జైలులోనే కసబ్ మత సాంప్రదాయం ప్రకారం ఖననం అధికారులు ఖననం చేశారు.

కసబ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న ఉజ్వల్ నికమ్ కసబ్ ఉరి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత దేశ విజయమని చెప్పాడు.

కసబ్ను ఉరితీయడంతో పార్లమెంటు దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురును కూడా ఉరి తీయాలనే డిమాండ్ సర్వత్రా వస్తోంది.
2008 నవంబర్ 26న ముంబయి మారణ హోమం జరిగింది. పది మంది ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధానిపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో 166 మంది మృతి చెందారు. దాడికి పాల్పడిన వారిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మృతి చెందారు. కసబ్ ఒక్కడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. 2008 నవంబర్ 27 అర్ధరాత్రి కసబ్ పట్టుబడ్డాడు. ఛత్రపతి శివాజీ టర్మినల్, నారీమన్ హౌజ్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో ఉగ్రవాదులు నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు.
కసబ్ తమ దేశానికి చెందిన వాడు కాదని పాకిస్తాన్ మొదట చెప్పింది. ఆ తర్వాత 2009 జనవరిలో తమ దేశవాసిగా అధికారికంగా ప్రకటించింది.
ఫిబ్రవరి 25, 2009లో కసబ్ పైన ఛార్జీషీట్ నమోదు.
డిసెంబర్ 16, 2009లో 26/11 కేసు విచారణ పూర్తయింది.
డిసెంబర్ 18, 2009న కసబ్ ఆరోపణలను ఖండించాడు.
మే 3, 2010న దేశంపై కసబ్ యుద్ధం ప్రకటించినట్లు, హత్య తదితర కేసులు ట్రయల్ కోర్టులో నమోదయ్యాయి.
మే 6, 2010లో అదే ట్రయల్ కోర్టు కసబ్కు ఉరిశిక్షను విధించింది.
ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను కసబ్ బాంబై హైకోర్టులో సవాల్ చేశారు. బాంబై హైకోర్టు ఫిబ్రవరి 21, 2011లో ట్రయల్ కోర్టు విధించిన ఉరిని సమర్థించింది.
మార్చి 2011లో కసబ్ బాంబే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు.
ఆగస్టు 29, 2012న ట్రయల్ కోర్టు, బాంబే కోర్టు తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్థించింది.
అక్టోబర్ 16, 2012న కసబ్ క్షమాభిక్షను తిరస్కరించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది.
నవంబర్ 5, 2012న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు.
నవంబర్ 7, 2012న కసబ్ను ఉరితీయాలని కేంద్రహోంశాఖ నిర్ణయించుకుంది.
నవంబర్ 8, 2012న ఉరి తీయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమాచారం అందించింది.
కాగా జైలులో ఉండగా కసబ్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. జైలులో ఉంటూ బిర్యానీ కావాలని డిమాండ్ చేశాడు. నన్ను ప్రేరేపించిన వారిని పట్టుకోవాలని, తనకు ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నాడు. భారతదేశ చట్టాలు తనను ఏమీ చేయలేవని, అంతర్జాతీయ కోర్టులో విచారించాలని, ఇక్కడి న్యాయస్థానాలలో న్యాయం జరగదని వ్యాఖ్యానించాడు.
పలు సందర్భాలలో జడ్జిల ముందు మాటలు మార్చుతూ వచ్చాడు. మారణ హోమానికి తాను కారణమని చెప్పిన కసబ్ ఆ తర్వాత మేమే చేశామని చెబుతూ.. తన వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, సహచరుచు ఇస్మాయిల్ ముంబయి మారణకాండకు ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఉరిశిక్ష పడ్డాక కొద్ది రోజులకు తనకు చావాలని లేదని, ఆ తర్వాత తనను చంపేయాలని లేదంటే పాక్లోని తన కుటుంబానికి ప్రమాదమని చెప్పేవాడు. ముంబయి దాడిని సమర్థించుకున్నాడు.
తన పోలికలు ఉన్న ఉగ్రవాదిని చంపేశాకే తనను అరెస్టు చేశారని చెప్పాడు. కసబ్ జైలులో ఉన్న ఈ నాలుగేళ్లు అతని భద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ కేసులో 658 మంది వాంగ్మూలమిచ్చారు. 30 మంది సాక్ష్యులు కసబ్ను గుర్తించారు. పదేళ్ల బాలిక కసబ్ పైన ఫిర్యాదు చేసింది. ముంబయి దాడులకు బీజం పాక్ లోనే అని సుప్రీం కూడా గుర్తించింది. ప్రత్యేక కోర్టులో ఇద్దరు ఎన్ఎస్జి కమెండోలు సాక్ష్యమిచ్చారు. సాంకేతిక ఆధారాలను చూపించేందుకు అమెరికా ఎప్బిఐ సహకరించింది.












Click it and Unblock the Notifications