బొత్స కూతురు పెళ్లికి 50కోట్లు: పిల్ కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లికి సుమారు రూ.50 కోట్లు ఖర్చు అయ్యాయని, దానిపై విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.
బొత్స సత్యనారాయణ తన కూతురు పెళ్లికి సుమారు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా కథనాలు వచ్చాయని, అవి ఎక్కడి నుండి వచ్చాయన్న దానిపై విచారణ జరపించాలని కోరుతూ కాంగ్రెసు సెక్యులర్ హిందూ ఫోరం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వారం రోజుల క్రితం వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు సెక్యూలర్ హిందూ ఫోరం రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఎల్.రవికుమార్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
బొత్స వివాహంలో చేసిన భారీ ఖర్చులపై ఆదాయ పన్ను శాఖ ముఖ్య కమిషనర్తో విచారణకు ఆదేశించాలని, ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల వసతి, రవాణాకు ప్రభుత్వం వెచ్చించిన సొమ్ముపై నివేదిక సమర్పించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని పిల్లో కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఏ, మంత్రి బొత్స సత్యనా రాయణ, ఆదాయపన్ను శాఖ కమిషనర్ను ప్రతివాదులుగా చేర్చారు. బొత్స కుమార్తె వివాహ వేడుకలో భారీగా అధికార దుర్వినియోగం జరిగిందని, సుమారు 50 కోట్లు ఖర్చు చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయని ఆయన పిల్లో ప్రస్తావించారు.