'వై' ఫ్యాక్టర్: కేసులతోనే చీల్చుతున్నారు, సారూప్యత
యడ్డీ, జగన్ విషయంలో పలు సారూప్యతలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కర్నాటకలోని హవేరీలో భారీ బహిరంగ ఏర్పాటు చేసిన యడ్డీ.. గతంలో జగన్ చేసినంటువంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో జగన్ తన వల్లే రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని పలుమార్లు చెప్పారు. అయితే తనకు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యం లేదని, దమ్ముంటే తనతో వచ్చే వారిపై కాంగ్రెస్సే చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తన తండ్రి మృతి తర్వాత కాంగ్రెసు తన కుటుంబాన్ని వేధిస్తోందన్నారు.
ఈ రోజు యడ్యూరప్ప కూడా బిజెపికి అదే సవాల్ విసిరారు. తనకు రాష్ట్రంలో శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చాలని ఏమాత్రం లేదని, తనతో వస్తున్న ఎమ్మెల్యేలపై బిజెపియే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొట్టరని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వానికి చివరి క్షణాలు వచ్చాయని చెప్పారు. బిజెపి తనను మోసం చేసిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దాదాపు ప్రతి విషయంలో జగన్, యడ్డీలకు సారూప్యత కనిపిస్తోంది.
- దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో ఉండి 2003లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేసి కాంగ్రెసును 2004లో అధికారంలోకి తీసుకు వచ్చారు. డెబ్బై ఏళ్ల బిఎస్ యడ్యూరప్ప కూడా దక్షిణాదిన ఏమాత్రం ప్రభావవంతంగా లేని బిజెపిని కర్నాటకలో అధికారంలోకి తీసుకువచ్చి మొదటిసారి దక్షిణ భారత దేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పర్చిన ఘనతను దక్కించుకున్నారు.
- ఎన్టీఆర్ టిడిపి స్థాపించిన తర్వాత కాంగ్రెసు దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. 1989లో గెలిచినా ఆ తర్వాత మళ్లీ ఓడిపోయింది. చంద్రబాబు పాలించిన సమయంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు సీట్లను వరుసగా కోల్పోయిందే తప్ప మెరుగుపడలేదు. వైయస్ పాదయాత్రతో ఒక్కసారిగా అధికారంలోకి వచ్చింది. 2004లో వ్యూహాత్మకంగా తెరాసతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసును వైయస్ గట్టున పడేశారు. యడ్డీ కూడా కర్నాటకలో బిజెపిని అధికారం వరకు తీసుకు వెళ్లారు.
- అధిష్టానం తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని, అదే విధంగా తనపై మరోవైపు కేసులు మోపుతున్నారని ఆరోపిస్తూ ఆయన బిజెపిని వదిలిపెట్టారు. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. జగన్ కూడా ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో సొంత కుంపటి పెట్టుకున్నారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతని ఆస్తులపై సిబిఐ విచారణ సాగుతోంది. జగన్ ఆరునెలలుగా ఊచలు లెక్కిస్తున్నారు. యడ్డీ కూడా జైలుకు వెళ్లి వచ్చారు.
దక్షిణ భారత దేశంలో 130 లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 42, తమిళనాడులో 39, కర్నాటకలో 28, కేరళలో 20, పుదుచ్చేరీలో 1 ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, యడ్యూరప్పల ప్రభావం కాంగ్రెసు, బిజెపిలపై పడే అవకాశముంది. 42+28 మొత్తం 70 అంటే దాదాపు సగానికి పైగా స్థానాలను జగన్, యడ్యూరప్ప ప్రభావితం చేయనున్నారు. అదే జరిగితే దక్షిణాదిన జాతీయ పార్టీలు మరింత తుడిచి పెట్టుకు పోవడం ఖాయమే. ఇప్పటికే బిజెపి కర్నాటకలో గాలి అనుచరుడు శ్రీరాములు పార్టీని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు ఎపిలో తెరాసను కాంగ్రెసు ఎదుర్కోవాల్సి వస్తోంది.