రాష్ట్రం ఇస్తే దండుకుంటారు: కావూరి, టిజి సెటైర్లు
ప్రత్యేక రాష్ట్రం వస్తే ధనికుల నుంచి డబ్బులు దండుకుంటారని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాదులోని ధనికుల నుంచి కోట్లు వసూలు చేసి, లంచాలు తిని, జేబులు నింపుకోవచ్చునని కొంత మంది ఆలోచిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు కోసమే కొంత మంది రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్ర, రాయలసీమల్లో కూడా వెనకబడిన ప్రాంతాలున్నాయని శ్రీకృష్ణ కమిటీ నివేదిక చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక అసమానతల కారణంగానే ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను ఆసరా చేసుకుని ప్రాంతీయ పార్టీలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపితే రాష్ట్రాన్ని, దేశాన్ని విభజించాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిలపక్ష సమావేశంపై రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేస్తే ఒకసారి దైవదర్శనం జరుగుతుంది, సమావేశం కూడా జరుగుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. అఖిల పక్ష సమావేశం నుంచి రాయలసీమ నుంచి కూడా ఓ ప్రతినిధిని పంపితే మంచిదని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయబోమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనపై ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.
ఇదిలావుంటే, కాంగ్రెసు నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ అఖిలపక్ష సమావేశానికి ఎవరు హాజరు కావాలనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.