కోర్టులో ఊరట: యడ్యూరప్పకు, కొడుకులకు బెయిల్
బెంగళూరు: మైనింగ్ కేసులో కర్ణాటక జనతా పార్టీ వ్యవస్థాపకుడు బియస్ యడ్యూరప్పకు ఊరట లభించింది. ఇది కర్ణాటక బిజెపికి దెబ్బగా భావిస్తున్నారు. యడ్యూరప్పకు, తనయులకు, అల్లుడికి కూడా మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారికి సిపిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వారంతా పూచీకత్తుతో పాటు 2 లక్షల రూపాయలకేసి బాండ్ ఇవ్వాలని సిబిఐ న్యాయమూర్తి ఎంసి బిరాదర్ ఆదేశించారు. కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టుకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. యడ్యూరప్పతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడు కోర్టుకు పాస్పోర్టులను స్వాధీనం చేయాలని, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి పొందాలని న్యాయమూర్తి షరతు పెట్టారు.
ప్రాసిక్యూషన్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిందితులపై కొన్ని ఆంక్షలు పెట్టాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. యడ్యూరప్పతో ఆయన అల్లుడు ఆర్ఎన్ సోహన్ కుమార్ న్యాయమూర్తి ఆదేశాలు వెలువరిస్తున్నప్పుడు కోర్టులో ఉన్నారు. యడ్యూరప్ప కుమారులు బివై విజయేంద్ర, బివై రాఘవేంద్ర కూడా కోర్టు సమన్లను గౌరవించారు.
కేసులో సిబిఐ దర్యాప్తును పూర్తి చేసినందున తమకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చి, యడ్యూరప్పకు, ఆయన ఇద్దరు కుమారులకు, అల్లుడికి ఊరట కలిగించింది.