వైయస్కు నేనే చెప్పా, ఆ పథకం ఘనత నాదే: కిరణ్
విశాఖ జిల్లాలో ఆయన మూడురోజుల ఇందిరమ్మ బాటను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. మన్మోహన్, సోనియాల నాయకత్వంలో, వారి ప్రోత్సాహంతో రాష్ట్రంలో పలు పథకాలు చేపట్టి పేదలను ఆదుకుంటున్నామని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షలు, రైతులకు లక్ష వరకు వడ్డీలేని రుణం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ. 13వేల కోట్ల రుణం తీసుకున్న డ్వాక్రా మహిళలు అసలు చెల్లిస్తే సరిపోతుందని, వడ్డీ తామే కడతామని చెప్పారు. వారం రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇస్తామన్నారు.
స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజీవ్ యువకిరణాల పథకం గొప్ప ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. కొందరు (చంద్రబాబు) అంటున్నట్లు ఇది ఆషామాషీ పథకం కాదన్నారు. ఈ ఏడాది మూడున్నర లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేసే 300 మంది తొలుత ఈ పథకంలో శిక్షణ పొందినవారేనన్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలని ఆయన అన్నారు.
స్థానిక సంస్థలకు వచ్చే రెండు, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహిళలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా జెండర్ కమిటీల ఏర్పాటుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. విద్యుత్ కష్టాలు శాశ్వతం కాదని, త్వరలోనే తీరిపోతాయని ముఖ్యమంత్రి ఓ మహిళ వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉపకార వేతనాలు ఎందుకు చేరట్లేదో తాను కలెక్టర్తో విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.