ముగ్గురు లెజెండ్స్ వదిలేసిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విజయ్
తమిళనాడులో విజయ్ విజయం సాధించిన తర్వాత తారల రాజకీయం గురించి చర్చ మొదలైంది. గతంలో సూపర్ స్టార్ల రాజకీయం గురించి, వారికి దక్కని అవకాశం విజయ్ కు ఎలా దక్కింది? అందుకు విజయ్ ఎంచుకున్న మార్గమేంటి? మిగతావారు చేసిన తప్పులేంటి? అనే విషయాలపై దక్షిణాదిలో తీవ్ర చర్చ నడుస్తోంది.
తిరిగి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు
2008లో 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి ఒక ప్రభంజనంలా కనిపించారు. అప్పటికే పాతుకుపోయిన కాంగ్రెస్, టీడీపీ వంటి దిగ్గజ పార్టీలను ఎదుర్కొని 18 సీట్లు, 18% ఓట్లు సాధించడం సామాన్యమైన విషయం కాదు. అయితే, రాజకీయాల్లో గెలుపోటముల కంటే 'స్థితప్రజ్ఞత' ముఖ్యం. చిరంజీవి మరో ఐదేళ్లు ఓపిక పట్టి ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన శూన్యంలో ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన చూపిస్తున్న ప్రభావం కంటే రెట్టింపు స్థాయిలో ఉండేదని విశ్లేషకులు భావిస్తారు. కానీ, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఆయన రాజకీయ ఇమేజ్కు, నమ్మకానికి తీరని నష్టం చేకూర్చింది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఎదుర్కోలేక, ఒత్తిడిని భరించలేక కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకొని, తిరిగి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అంటూ వచ్చిన రజనీకాంత్, అంతే వేగంగా వెనక్కి తగ్గారు. దశాబ్దాల కాలం పాటు అభిమానులను ఊరించి, చివరి నిమిషంలో అనారోగ్యం, రాజకీయ ఒత్తిడిని సాకుగా చూపి తప్పుకున్నారు. దీంతో ఆయన కెరీర్లో ఒక 'గోల్డెన్ ఛాన్స్'ను మిస్ చేసుకున్నట్లయ్యింది. ఆధ్యాత్మిక రాజకీయం అనేది తమిళ తంబీలకు సరిపడలేదు. ఆరోజు వెనకడుగు వేయకుండా, ఒత్తిడులకు తలొగ్గకుండా రజనీకాంత్ ఎన్నికల బరిలోకి దిగివుంటే ఈరోజు విజయ్ సాధించిన విజయం కన్నా భారీ విజయాన్ని నమోదు చేసుకునేవారనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. విజయ్ లా ఉంటే స్పష్టతతో ఉండాలి. లేదంటే వదిలేయాలి. కానీ రజనీ ఊగిసలాట ధోరణి, సందిగ్ధత చివరకు అభిమానులకే నచ్చలేదు. ఊరించి, ఉస్సూరనిపించడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.
మేదోమథనానికే పరిమితమైన కమలహాసన్
మరోవైపు, లోక నాయకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టినా, దాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. సిద్ధాంతాల కంటే మేధోమథనానికే అధిక ప్రాధాన్యతనిచ్చారు. బలమైన క్యాడర్ ను నిర్మించుకున్నప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయారు. చివరకు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చి తన రాజకీయ ఉనికిని నామమాత్రం చేసుకున్నారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్.. ఈ ముగ్గురు రాజకీయాల్లో ఎదురయ్యే అవమానాలు, విమర్శల కంటే కెమెరా ముందు తమ లెగసీని కాపాడుకోవడం మిన్న అని భావించారు. అందుకే 'ఖైదీ నంబర్ 150', 'రోబో 2.0', 'విక్రమ్' వంటి సినిమాలతో భారీ కంబ్యాక్స్ ఇచ్చి, తమకు వెండితెరపై తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం వారి పాత్రలు అసంపూర్ణంగానే మిగిలిపోయాయి.












Click it and Unblock the Notifications