సమైక్యలొల్లి, ఇంటిముట్టడి: జగన్ ఎమ్మెల్యే రాజీనామా?
సమైక్యవాదులు ఇంటిని ముట్టడించడంతో గుర్నాథ్ రెడ్డి స్పందించారు. తాను సమైక్యవాదినేనని చెప్పారు. అవసరమైన పక్షంలో తాను సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాకు కూడా సిద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
గుర్నాథ్ రాజీనామా?
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వస్తుందనే ప్రచారం నేపథ్యంలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా రాజీనామా చేయాలని సమైక్యాంధ్ర జెఏసి నేతలు ఒత్తిడి తేవడంతో గుర్నాథ్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని జెఏసి నేతలకు సమర్పించారు. అదే లేఖను తాను సభాపతి(స్పీకర్)కి పంపిస్తానని ఆయన జెఏసి నేతలకు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచారన్నారు. వారి త్యాగాలు వృథా కానీయమన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రెండుమూడు రోజుల్లో హైదరాబాద్ వెళ్లి తాను సభాపతికి రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. కాగా గుర్నాథ్ రాజీనామాను స్పీకర్కు ఫ్యాక్స్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
ఇప్పట్లో తెలంగాణ రాదు
ఇప్పట్లో తెలంగాణ రాదని మంత్రి శైలజానాథ్ హైదరాబాదులో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెంటిమెంటు పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటివి సరికావన్నారు.
ఢిల్లీలో తమ సమైక్యవాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి పార్టీకి, కేంద్రానికి సమైక్య రాష్ట్రం ఆవశ్యకతను గురించి చెబుతామన్నారు. హైదరాబాదుపై రెఫరెండం వాదనలు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ అంతర్భాగం అన్నారు. రాష్ట్రం విడిపోయే సమస్యే లేదన్నారు.