ప్రధాని డాక్టర్.. మేం రోగులం, కెసిఆర్కూ మందు: టిజి
శ్రీకృష్ణ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తాము కోరామని, ఆరో సిఫార్సును అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. తెలుగు వారు ఐక్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నామని, ప్రధాని తమ విజ్ఞప్తిని సావధానంగా విన్నారన్నారు. ఆయనకు రాష్ట్రానికి సంబంధించిన చారిత్రక విషయాలని చెప్పామన్నారు. విభజనతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.
తెలంగాణ అంశం మేనిఫెస్టోలో లేదని చెప్పామన్నారు. తమకు ఆయన న్యాయం చేస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివానని, తనకు విషయంపై పూర్తి అవగాహన ఉందని ప్రధాని చెప్పారన్నారు. సమైక్యం కోసం తాము చెప్పాల్సిందంతా చెప్పామన్నారు. మా ఆవేదన ఆయనకు తెలియజేశామన్నారు. ప్రస్తుతం తాము రోగి స్థానంలో, ప్రధాని డాక్టర్ స్థానంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
ఓ జబ్బు గురించి రోగికి డాక్టర్ కంటే ఎక్కువ తెలుసునని, అందుకే తమ ఆవేదన చెప్పామన్నారు. తర్వాత గులాం నబీ ఆజాద్ను, వాయలార్ రవిలను కలుస్తామని చెప్పారు. రాష్ట్రపతి అనుమతిస్తే ఆయనను కూడా కలుస్తామన్నారు. రాష్ట్రం, దేశం సౌభాగ్యంగా ఉంటుందనే ఆశాభావం వారు వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా అనే అంశంపై చర్చ జరిగిందన్నారు. వెనుకబాటుతనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉందని ప్రధానికి చెప్పామన్నారు.
గూర్ఖాలాండ్ తరహా ప్యాకేజీ తెలంగాణకు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఎంత ప్యాకేజీ అయినా ఇచ్చుకోవచ్చునన్నారు. విభజనతో ఇబ్బందులు వస్తాయని చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాగా చిక్కారని, ఆయనకు కూడా మందు ఇస్తే బాగుంటుందని, అది ఎంత మంచి ప్యాకేజీ అయినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రం మాత్రం సమైక్యంగానే ఉంచాలని కోరామన్నారు.