కెసిఆర్ వ్యూహాత్మక మౌనం: కోదండరాం ఆమరణదీక్ష?

ఇటీవల సీమాంధ్రకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నేతలు హైదరాబాదు వచ్చి హడావిడి చేయడం అందులో భాగమేనని ఆయన అంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమపై తెలంగాణవాదులు దాడులు చేస్తే, రేపు రాష్ట్రం ఇస్తే తెలంగాణలోని సీమాంధ్రులపై ఇలాంటి దాడులే జరుగుతాయని ప్రచారం సాగిస్తారని, అందువల్ల తెలంగాణలోని సీమాంధ్రులకు తెలంగాణ వచ్చినా ఏమీ కాదని సంకేతాలు ఇవ్వాలని, అందువల్ల సీమాంధ్ర విద్యార్థి నేతలు తమ పని తాము చేసుకునేందుకు ఏ విధమైన ఆటంకాలు కలిగించవద్దని ఆయన సూచించారని చెబుతున్నారు.
హైదరాబాదులో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తలపెట్టిన సమైక్యాంధ్ర సమావేశాన్ని అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించినా కెసిఆర్ సూచనతో వెనక్కి తగ్గారని అంటున్నారు. నామమాత్రం నిరసన మాత్రమే వ్యక్తమయ్యేలా చూశారు. సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సమావేశానికి ఏలాంటి ఆటంకాలు కలిగించడానికి కూడా తెలంగాణవాదులు ముందుకు రాలేదు. సీమాంధ్ర విద్యార్థి నేతలు హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్లో హంగామా చేశారు, ఆ తర్వాత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఎక్కడా వారికి తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఏర్పడలేదు. కెసిఆర్ వ్యూహంలో భాగంగానే అలా జరిగిందని చెబుతున్నారు.
దానికితోడు, తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలకు ఒక అవకాశం ఇవ్వాలని ఓ సీనియర్ నేత ఇతర పార్టీల తెలంగాణ నాయకులను కోరారని అంటున్నారు. తమ పార్టీపై విమర్శలు చేయకూడదని, ఈ ఒక్కసారికి తమకు అవకాశం ఇవ్వాలని ఆయన తెలంగాణవాద పార్టీలను కోరినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధిష్టానం సంకేతాలు ఇప్పటి వరకు తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాయని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థితిలో హంగామా చేయడం సరి కాదని, చివరి వరకు వేచి చూద్దామని ఆయన చెబుతున్నారని అంటున్నారు.
కాగా, ఈ నెల 28వ తేదీన తెలంగాణపై నిర్ణయం రాకపోయినా, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చినా తాము చేపట్టే కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ జెఎసి కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ఉంటే ఆమరణ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కెసిఆర్ అందుకు సుముఖంగా లేరని అంటున్నారు. కెసిఆర్ను ఒప్పించే పనిలో జెఎసి నేతలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఇవ్వకపోతే మిలిటెంట్ పోరాటం ఉంటుందని, అది కూడా శాంతియుతంగానే ఉంటుందని కోదండరామ్ చెబుతున్నారు. ఆయన ప్రకటనలోని ఆంతర్యం తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడుతున్నట్లు చెప్పడమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications