జగన్ జైల్లో, లోకేష్ను వాళ్లమ్మ చదివించింది: బాబు
వైయస్ రాజశేఖర రెడ్డిని నమ్ముకున్న వారు ఇప్పుడు జైళ్లలో ఉన్నారన్నారు. చివరకు ఆయన తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంచల్గూడ జైలులో ఉన్నారన్నారు. అవినీతిపట్ల ఉదాసీనంగా ఉండవద్దన్నారు. తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు. మాట తప్పే ప్రసక్తి లేదన్నారు. రుణ మాఫీ కష్టమే అయినప్పటికీ దానికి మార్గం ఉందన్నారు.
తన కొడుకు నారా లోకేష్ను వాళ్ల అమ్మ బాగా చదివించిందని, తనకు ఎలాంటి స్వార్థం లేదని, తనపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తోందని విమర్శించారు. ప్రపంచ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన విధంగా విద్యుత్ భారాన్ని మరెవ్వరూ మోపలేదని మండిపడ్డారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని ఆరోపించారు.
టిడిపి అధికారంలోకి వస్తే ఈ బాధలన్నింటిని తీర్చివేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగం - ఉపాధి అజెండాగా కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీ అన్నది కష్టమని తెలిసినా.. మనసుంటే అనేక మార్గాలు ఉంటాయని, ఆడిన మాట తప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు పాలన సాగించానని, ఆ సమయంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను సక్రమంగా పని చేయించానని చెప్పారు.
వైయస్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు తినడు.. ఇతరులను తిననీయడని వైయస్ పదే పదే చేసిన విషప్రచారం వల్ల కొంతమంది ఆయనతో కలిసి వెళ్లారన్నారు. అందుకు నేడు అటు వైపు వెళ్లిన వారు ఫలితం అనుభవిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ ఐదేళ్ల మూడు నెలల హయాంలో జరిగిన వ్యవహారాల వల్ల ఐఏఎస్ అధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా అధికారులు జైలు ఊచలు లెక్కపెట్టిన ఉదంతాలు లేవన్నారు.