హైదరాబాద్ వదలం: ఏరాసు, సీమను అడగండి: బైరెడ్డి
తమ సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపించినందు వల్లే కేంద్రం ప్రకటనను వాయిదా వేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీలో కలిసినంత మాత్రాన వచ్చే అదనపు బలం ఏమీ కాంగ్రెసుకు ఉండదన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో చాలా బలంగా ఉందన్నారు.
రాష్ట్ర విభజన చిన్న పని కాదు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం అంటే అంత తేలికైన పని కాదని కేంద్రమంత్రి పళ్లం రాజు చిత్తూరు జిల్లాలో అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వానికి, తమ పార్టీ అధిష్టానానికి బాగా తెలుసునని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక మన్యసీమను ఏర్పాటు చేయాలని చందాలింగయ్య దొర వేరుగా డిమాండు చేశారు.
షిండేను కలిసిన బైరెడ్డి
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజలు ఆంధ్రాతో, తెలంగాణతో కలిసేందుకు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని, రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ రాష్ట్రానికి అక్కడి ప్రజలు చూస్తున్నారన్నారు.
తెలంగాణ ఏర్పాటును ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇప్పుడు సీమ సంగతి చూడవలసి ఉందన్నారు. రాయలసీమ నేతలు సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు సమైక్య నినాదాన్ని పక్కన పెట్టాలని సూచించారు. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడాలన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే మూడుగా చేయాలని తాను షిండేను కోరానని చెప్పారు.