బాబు పాదయాత్ర: వల్లభనేని వంశీ వర్సెస్ దేవినేని ఉమ
నల్లగొండ జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాబు పాదయాత్రలో దేవినేని ఉమ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండగా, వంశీ చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వంశీని చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది పక్కకు నెట్టడం ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. తాను పార్లమెంటు సీటుకు పోటీ చేసిన నాయకుడినని వంశీ వారికి చెప్పారు.
కృష్ణా జిల్లాల్లో దేవినేని ఉమామహేశ్వర రావుకు, వంశీకి మధ్య చాలా కాలంగా అంతర్గత పోరు సాగుతున్న విషయం తెలిసిందే. దేవినేని ఉమామహేశ్వర రావు నాయకత్వం కింద తాను పనిచేయబోనని వంశీ ప్రకటించిన సందర్భం కూడా ఉంది. అయితే, ఆ తర్వాత చంద్రబాబుతో రాజీకి వచ్చి పార్టీలో కొనసాగుతున్నారు.
కాగా, చంద్రబాబు పాదయాత్ర ఎప్పటిలాగే సాగుతోంది. తెలంగాణలో చేసిన ప్రసంగాలనే కృష్ణా జిల్లాలో చేస్తున్న ప్రసంగాలు కూడా తలపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై ఆయన ఎప్పటి లాగే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని, తనకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
చంద్రబాబుకు ఆంధ్ర పర్యటనలో మాత్రం కాస్తా ఊరట లభిస్తున్నట్లే చెప్పాలి. ఆయన తెలంగాణ అనుకూల వైఖరిపై కృష్ణా జిల్లాలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురు కావడం లేదు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా వైఖరి ప్రకటించారనే ఊసు కూడా ఎవరూ ఎత్తడం లేదు. ఎప్పటిలాగే, చంద్రబాబు నడుస్తున్న దారిలో ముందుగా నీళ్లు చల్లడం వంటి పనులు సాగుతున్నాయి.