రాహుల్తో సీమాంధ్ర భేటీ వాయిదా: సోనియా టాక్స్
రాహుల్ గాంధీతో సమావేశాన్ని సీమాంధ్ర నేతలు కీలకంగా భావించారు. దీంతో రాహుల్తో సమావేశానికి మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇప్పుడే బాధ్యతలు స్వీకరించడంతో చాలా విషయాలపై దృష్టి పెట్టవలసి ఉండడంతో రాహుల్ వారికి ఇంకా అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు.
కాగా, సీనియర్ నేతలపై తెలంగాణపై సోనియా గాంధీ గురువారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ పాల్గొన్నారు. బుధవారంనాడు జరిగిన సమావేశానికి గురువారంనాటి సమావేశాన్ని కొనసాగింపుగా ఢిల్లీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణపై సోనియా గాంధీ సీనియర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. దానికి పొడగింపుగా గురువారం సమావేశమైనట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఈ నెల 28వ తేదీలోగా కాకున్నా త్వరలోనే నిర్ణయం ప్రకటించాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఓ నిర్ణయానికి రావాలనే పట్టుదలతో ఆమె ఉన్నారని అంటున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి ఏకే ఆంటొనీతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ సందర్భంగా ఆంటొనీని సీమాంధ్ర నేతలు కోరారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుందని వారు వివరించారు. ఆలాగే ఉద్యోగావకాశాలు ఎక్కువ అనివారు వివరించారు. విభజిస్తే నదీజలాల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఆంటొనీ దృష్టికి వారు తెసుకువెళ్లారు. సీమాంధ్ర నాయకులు చెప్పిన విషయాలను ఆయన సానుకూలతతో విన్నట్లు సమాచారం.