టిడిపి బైక్ ర్యాలీలో నారా లోకేష్: పార్టీపై ప్రత్యేక దృష్టి
పార్టీపై దృష్టి
మరికొద్ది రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తాను మోస్తున్న హెరిటేజ్ బాధ్యతలను లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణిపై పెట్టనున్నారు. మరో ఒకటి రెండు నెలల్లో లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న లోకేష్ అప్పుడే పార్టీపై దృష్టి సారిస్తున్నారు. కదిరిలో తెలుగు తమ్ముళ్లకు పలు సూచనలు చేయనున్నారు.
గతంలోనే నారా లోకేష్ పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు తన మిత్రుల అండదండలతో పార్టీలో అభ్యర్థుల ఎంపికపై సర్వేలు పూర్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సర్వేల ఆధారంగా ఏ నియోజకవర్గం నుండి ఎవరిని నిలపాలనే అంశంపై కూడా లోకేష్తో పాటు పార్టీ సీనియర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయట. సీనియర్లతో కలిసి తాను చేసిన సర్వే వివరాలను ఆయన తన తండ్రి దృష్టికి తీసుకు వెళ్లారట.
ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగు పెట్టేకంటే ముందే పార్టీని ఓ గాడిలో పెట్టేందుకు ఆయన తాపత్రయ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ కూడా పార్టీ కోసం అవకాశం చిక్కినప్పుడల్లా పని చేస్తున్నారు. పలు జిల్లాల్లో పర్యటిస్తూ తెలుగు దేశం కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.