అసభ్యంగా, అనుచిత వ్యాఖ్య:కిరణ్కు తప్పని మార్ఫింగ్
ముఖ్యమంత్రి ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పెట్టారని, అలా చేసిన వారిని పట్టుకొని చట్టపరంగా శిక్షించాలని సిసిఎస్ పోలీసు స్టేషన్లో యువజన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు బుధవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఫోటోలు అప్ లోడ్ చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసినట్లు వారు చెప్పారు.
కాగా సామాజిక వెబ్సైట్లు ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర వాటిల్లో పలువురి ముఖాలను మార్ఫింగ్ చేస్తున్నట్లు తరుచూ వింటున్న విషయం తెలిసిందే. కొందరిని మార్ఫింగ్ చేయడంతో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా సినిమా తారల ముఖాలను మార్ఫింగ్ చేయడం, వారిపై అనుచిత వ్యాఖ్యలు రాయడం చేస్తుంటారు.
గతంలో హీరోలు కమ్ రాజకీయ నాయకులు నందమూరి బాలకృష్ణ, చిరంజీవిల పై అనుచిత వ్యాఖ్యలు కనిపించాయి. దీనిపై ఇరువురి హీరోల అభిమానులు ఫిర్యాదులు చేశారు. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ముఖం అంతర్జాలంలో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఒబామా, అబ్దుల్ కలాం తదితర రూపాల్లో బ్రహ్మానందం ఫోటోలు పెట్టారు.