అక్కడి తెలుగువారంతా తెలంగాణవాదులే: లగడపాటి
విద్వేషాలు రెచ్చగొడుతున్న కెసిఆర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేర్పాటు ఉద్యమం వల్ల తెలంగాణకే నష్టమని ఆయన అన్నారు. హైదరాబాదులోని తెలుగు వాళ్లంతా తెలంగాణవాదులే అన్నారు. కెసిఆర్ ప్రసంగం సిడిలను తాను కోర్టులో సాక్ష్యాలుగా ప్రవేశ పెడతానని చెప్పారు. వేర్పాటు వాద ఉద్యమం వల్ల తెలంగాణ ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు.
ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే కెసిఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. వేర్పాటువాదులకు భయపడి తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. రాజధానిలోని తెలుగువారంతా తెలంగాణవాదులే అయినప్పటికీ రాష్ట్రంలో తొంభై శాతం మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. తెరాస నేతలు మాట్లాడేది, వారి పత్రిక, టీవి ఛానళ్లు చూపించేవి తెలుగేనని, అలాంటివారే తెలుగును విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు వ్యాఖ్యలు సరికావు
తమ పార్టీ పైన, తమ పార్టీ నేతల పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికావని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు. చంద్రబాబు రికార్డుల కోసమే పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.